Skip to main content

పులివెందుల ఎస్సై సాహసం.. ప్రాణాలకు తెగించి, కారుపై వేలాడుతూ మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట!

 



మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పులివెందుల ఎస్సై గోపీనాథరెడ్డి ప్రాణాలకు తెగించి పోరాడిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. స్థానిక రాఘవేంద్ర థియేటర్ సమీపంలో రోడ్డు పక్కన ఓ వాహనంలో పెద్ద ఎత్తున మద్యం ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన నిందితులు వారిని భయపెట్టేందుకు కారును ముందుకు, వెనక్కి వేగంగా కదిలించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ఎస్సై గోపీనాథ్‌రెడ్డి కారు ముందు భాగాన్ని పట్టుకున్నారు.


అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని నిందితులు కారును వేగంగా ముందుకు పోనిచ్చారు. అప్రమత్తమైన ఎస్సై జారి కిందపడకుండా కారును గట్టిగా పట్టుకున్నారు. ఎస్సై కారుపై వేలాడుతుండగానే నిందితులు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం కారును పోనిచ్చారు. ఈ క్రమంలో ఎస్సై గోపీనాథ్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి కారు అద్దాలను పగలగొట్టారు.

ఈలోపు కారును అనుసరించిన పోలీసులు వాహనాన్ని అడ్డుకోవడంతో నిందితుల ఆటకు అడ్డుకట్ట పడింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారు నుంచి 80 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి సాహసోపేతంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎస్సైపై ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.