పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు విషయంలో హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో కేంద్రం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు నిర్ణయాల అంశంలో దోనె సాంబశివరావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ అండర్ సెక్రటరీ లలిత అఫిడవిట్ దాఖలు చేశారు. 2014 ఏప్రిల్ 23న అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పేర్కొందని.. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం రాజధాని అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసిందని అందులో తెలిపారు. రాజధాని నిర్ణయించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పాత్రలేదని.. తమ రాజధానులను నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర సమగ్ర ప్రాంతాల అభివృద్ధి 2020 చట్టం రూపకల్పన విషయాన్ని రాష్ట్రప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకురాలేదని అఫిడవిట్లో పేర్కొంది. చట్టాలు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈనెల 14న పేర్కొన్న అంశాలనే తాజాగా కేంద్రం పునరుద్ఘాటించింది.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment