సామాజిక ఉద్యమకారిణి రెహానా ఫాతిమాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అర్ధనగ్న శరీరంపై తన పిల్లల చేత బొమ్మలు వేయించుకున్న కేసులో బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. ఇలాంటి కేసు రావడం వల్ల కొంచెం కంగారు పడ్డామని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇలాంటి వీడియోలను చూడటం వల్ల మన దేశ సంస్కృతిపై పిల్లలు ఎలాంటి భావాన్ని ఏర్పరుచుకుంటారని ప్రశ్నించింది. ఇలాంటి ఆలోచనలు రావడమే దారుణమని చెప్పింది. ఆమె ఉద్యమకారిణి కావచ్చని... అయినప్పటికీ ఇలాంటి వాటిని అనుమతించలేమని తెలిపింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment