సామాజిక ఉద్యమకారిణి రెహానా ఫాతిమాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అర్ధనగ్న శరీరంపై తన పిల్లల చేత బొమ్మలు వేయించుకున్న కేసులో బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. ఇలాంటి కేసు రావడం వల్ల కొంచెం కంగారు పడ్డామని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇలాంటి వీడియోలను చూడటం వల్ల మన దేశ సంస్కృతిపై పిల్లలు ఎలాంటి భావాన్ని ఏర్పరుచుకుంటారని ప్రశ్నించింది. ఇలాంటి ఆలోచనలు రావడమే దారుణమని చెప్పింది. ఆమె ఉద్యమకారిణి కావచ్చని... అయినప్పటికీ ఇలాంటి వాటిని అనుమతించలేమని తెలిపింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.
రాజధాని అమరావతిని అభివృద్ధి చెందకుండా చేసేందుకు చూస్తున్నారని, అలా జరగనివ్వమని వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు హెచ్చరించారు. విశాఖపట్టణంలో నిర్వహించిన టీడీపీ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని బతికించుకునే శక్తి తెలుగు ప్రజలకు ఉందని అన్నారు. గతంలో వైఎస్ తనను చాలా సార్లు విమర్శించారు కానీ, తాను ప్రారంభించిన కార్యక్రమాలకు ఆయన ఏనాడూ అడ్డుపడలేదని, అందుకే, హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. ఏపీలో వున్నవి గ్రామ సచివాలయాలా? వైసీపీ కార్యాలయాలా? అని ప్రశ్నించిన చంద్రబాబు, శ్మశాన వాటికలకు కూడా వైసీపీ రంగు వేసుకుంటే బాగుంటుందని విమర్శించారు. ప్రజలే మీ ముఖాలకు రంగు వేసి బజార్లో తిప్పే రోజు వస్తుంది అని వైసీపీ నేతలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

Comments
Post a Comment