మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరతారంటూ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందించారు. గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఒకవేళ గంటా బీజేపీలోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తామని మాధవ్ స్పష్టం చేశారు. ఇక, ఇంగ్లీషు మీడియం అంశంపైనా ఆయన మాట్లాడుతూ, మాతృభాషను నేర్చుకునే హక్కును నిర్మూలించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఏ ప్రభుత్వమూ ఇలాంటి చర్యలకు దిగరాదని హితవు పలికారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment