మహారాష్ట్రలో ఓ సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఉద్దేశమని, ఈ దిశగా శుక్రవారం నాడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ ఉదయం సోనియా నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. శివసేన - ఎన్సీపీల మధ్య ఓ డీల్ కుదిరితే, ఆపై తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని, ముందు ఆ రెండు పార్టీలూ ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. అయితే, శివసేన - ఎన్సీపీ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతిచ్చేందుకు సిద్ధమని సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ముంబైలో ఈ సాయంత్రం నుంచి మూడు పార్టీల మధ్యా తుది చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు.
Comments
Post a Comment