ఏపీలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించుకోవడం పట్ల విమర్శలు వస్తుండడం తెలిసిందే. దీనిపై అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాతృభాష తెలుగును ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే, తెలుగులో చదివితే ఏం ప్రయోజనం అని చెప్పడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ బాష చాలా గొప్పదన్న తరహాలో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాంటప్పుడు పాదయాత్రలో కూడా ఇంగ్లీషులో మాట్లాడాల్సిందని ఎద్దేవా చేశారు. ఓట్లను కూడా తెలుగుకు బదులు ఇంగ్లీషులోనే అడిగితే బాగుండేదని అన్నారు. అప్పుడు ఓట్లన్నీ వైసీపీకే వచ్చుంటే ప్రజలు ఇంగ్లీషుకు సమ్మతం తెలిపినట్టుగా భావించవచ్చని వ్యాఖ్యానించారు, ఇంగ్లీషుకు ఎవరూ వ్యతిరేకం కాదని, కానీ మాతృభాషను చిన్నచూపు చూడడం ఎందుకని మండలి ప్రశ్నించారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment