Skip to main content

ఆర్టీసీపై ముగిసిన సీఎం కేసీఆర్‌ సమీక్ష





ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ముగిసింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, సునిల్ శర్మ, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, ఏజీ ప్రసాద్, అడిషనల్  ఏజీ రాంచందర్ రావు, ఆర్టీసీ ఈడీలు వెంకటేశ్వరరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. షరతుల్లేకుండా కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే వచ్చి చేరతామని ఆర్టీసీ ఐకాస ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏయే అంశాలు ఉన్నాయి? హైకోర్టు ఎలాంటి ఆదేశాలిచ్చిందనే అంశంతో పాటు ఐకాస ప్రతిపాదనలపైనా ఈ భేటీలో చర్చించారు. 
ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకుశంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే ప్రథమ కర్తవ్యంగా ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

‘‘ఆర్టీసీకి ఇప్పటికే రూ.5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్ ఫండ్ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సీపీఎస్‌కు రూ.500 కోట్లు ఇవ్వాలి. డీజిల్ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉన్నది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పీఎఫ్‌ బకాయిల కింద నెలకు దాదాపు రూ.65 నుంచి 70 కోట్ల  వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి. ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. అయినా సరే, ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుతుంది? ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని యథావిధిగా నడపడం సాధ్యం కాదు’’ అని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమయింది. ఈ పరిస్థితులతో పాటు రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.