Skip to main content

అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం హర్షణీయం: తులసిరెడ్డి



ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, రాజధాని ప్రాంతాల్లో నిర్మాణాలను ఆపకుండా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఇది రాజధాని కోసం భూములిచ్చిన రైతుల, రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాల, మీడియా విజయమని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో అమరావతిపై భయాందోళనలు నెలకొన్న మాట వాస్తవమని అన్నారు.

దీనికి తోడు అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ప్రాజెక్టు నుంచి సింగపూర్ తప్పుకోవడం, దానిపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టతను ఇవ్వకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజధాని పనులపై జగన్ సమీక్ష నిర్వహించడం, ఇప్పటికే చేపట్టిన పనులను కొనసాగించాలని నిర్ణయించడం హర్షణీయమని తెలిపారు.

ఏపీకి రాజధాని, హైకోర్టు రెండు కళ్లవంటివని తులసిరెడ్డి చెప్పారు. వీటిలో ఒకదాన్ని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేస్తే, మరొకదాన్ని రాయసీమలో ఏర్పాటు చేయాలనే విషయాన్ని శ్రీబాగ్ ఒప్పందం స్పష్టంగా చెబుతోందని గుర్తు చేశారు. రాజధానిని కోస్తాలో కొనసాగించాలని నిర్ణయించిన నేపథ్యంలో, హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడం సమంజసమని చెప్పారు.

గుజరాత్, కేరళ, ఉత్తరప్రదేశ్ సహా 11 రాష్ట్రాల్లో రాజధాని, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. హైకోర్టును రాయలసీమలో, హైకోర్టు బెంచ్ లను అమరావతి, విశాఖపట్నంలలో ఏర్పాటు చేయడం మంచిదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇద్దరూ రాయలసీమ వాసులై ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం బాధాకరమని అన్నారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని చంద్రబాబు బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.