విజయవాడలోని ప్రఖ్యాత స్టెల్లా మేరీ కాలేజీలో ఈ ఉదయం ఒకేసారి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. వీరంతా హాస్టల్ లో ఉన్నవారేనని తెలుస్తుండటంతో ఫుడ్ పాయిజన్ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. అనారోగ్యంతో ఉన్న విద్యార్థినులను సమీపంలోని ఆసుపత్రులకు హుటాహుటిన తరలించి, చికిత్స చేయిస్తున్నారు. జరిగిన ఘటనపై స్పందించిన కళాశాల యాజమాన్యం, ఫుడ్ పాయిజన్ జరిగిందన్న వార్తలను కొట్టి పారేసింది. వారంతా వైరల్ ఫీవర్ కు గురయ్యారని వివరణ ఇచ్చింది. అయితే, ఒకేసారి 30 మందికి వైరల్ ఫీవర్ ఎలా వచ్చిందన్న ప్రశ్నలకు మాత్రం యాజమాన్యం సమాధానం ఇవ్వలేదు. ఇక ఆసుపత్రుల్లో చేరిన వారిని పరామర్శించేందుకు వారివారి బంధుమిత్రులు తరలిరావడంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment