ఏపీలో మీడియాను కట్టడి చేసే విధంగా ప్రభుత్వం జీవో నెంబర్ 2430 అమలుకు
నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మీడియా సంస్థలు, విపక్షాలు
మండిపడుతున్నాయి. ఇది దుర్మార్గపు జీవో అని, దీన్ని తక్షణమే రద్దు చేయాలని
ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. తాజాగా, జీవో 2430 వివాదాన్ని ప్రెస్
కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించింది. జీవోపై వివరణ ఇవ్వాలంటూ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ ముఖ్య కమిషనర్ లకు నోటీసులు జారీ
చేసింది. ఈ సందర్భంగా జీవో 2430పై ప్రెస్ కౌన్సిల్ వ్యాఖ్యానించింది. ఈ
జీవో పాత్రికేయుల విధి నిర్వహణకు, మీడియా స్వేచ్ఛకు పెనుభారంగా ఉందని
అభిప్రాయపడింది.
కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్ పిటిషన్లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.
Comments
Post a Comment