Skip to main content

చౌటాలా.. చౌటాలా.. నువ్వెక్కడ?

 
చౌటాలా.. చౌటాలా.. నువ్వెక్కడ?
 దుశ్యంత్‌ చౌటాలా ఎవరు?.. మాజీ ఉపప్రధాని చౌదరీ దేవీలాల్‌ మునిమనవడు.. హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌటాలా మనవడు.. మాజీ ఎంపీ.. ఇప్పటివరకు తెలిసిందిదే.. కానీ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనో కింగ్‌ మేకర్‌..! ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పే కీలక నాయకుడు.. ‘చౌటాలా.. చౌటాలా.. నువ్వెక్కడ’ అంటూ ప్రధాన పార్టీలు ఆత్రుతగా వెతుకుతున్న సరికొత్త ‘హంగ్‌ కింగ్‌’.
రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితం హంగ్‌ దిశగా సాగుతోంది. భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నా.. రెండు పార్టీలకు స్పష్టమైన ఆధిక్యం దక్కే అవకాశాలు కన్పించట్లేదు. దీంతో ఇరు పార్టీల చూపు  చౌటాలా నాయకత్వంలోని జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ)పై పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కోసం భాజపా, కాంగ్రెస్‌లు ఇప్పుడు ఆయన మద్దతు కోరుతున్నాయి.
రంగంలోకి కేంద్ర నేతలు..
ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా తారుమారవడంతో భాజపా, కాంగ్రెస్‌ కేంద్ర నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఫలితాలు సంక్లిష్టంగా ఉండటంతో  భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా.. సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను దిల్లీకి పిలిచారు. మరోవైపు భాజపా తన మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌ పెద్దలను జేజేపీ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపేందుకు పంపింది. 
అటు కాంగ్రెస్‌ కూడా వ్యూహాలు రచిస్తోంది. భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌నేత, మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ హుడాతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు.
దుశ్యంత్‌కు సీఎం పదవి..?
కాంగ్రెస్‌ మరో అడుగు ముందుకేసి చౌటాలాకు సీఎం పదవి ఇస్తామని ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలిసింది. గతంలో కర్ణాటక మాదిరిగా హరియాణాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది హస్తం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. సీఎం పదవి ఎవరిస్తే ఆ పార్టీకే మద్దతిస్తామని అంతకుముందు చెప్పిన దుశ్యంత్‌.. ఇప్పుడు మాత్రం తుది ఫలితం వచ్చాకే తన నిర్ణయం వెల్లడిస్తానని అంటున్నారు. ఈ నేపథ్యంలో హరియాణాలో భాజపా మరోసారి గద్దెనెక్కాలన్నా లేదా హస్తం పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నా.. అది ‘ఛోటా చౌటాలా’పైనే ఆధారపడి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...