Skip to main content

అధికారికంగా రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్.. ఇకపై అక్కడ ఎవరైనా ఆస్తులు కొనొచ్చు!

 


భారతదేశానికి శిరస్సు వంటి జమ్మూకశ్మీర్ అధికారికంగా రెండు ముక్కలైంది. బుధవారం అర్ధరాత్రి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (జమ్మూకశ్మీర్, లడక్) అవతరించింది. ఈ నేపథ్యంలో భారత్ లో రాష్ట్రాల సంఖ్య ఒకటి తగ్గగా... కేంద్రపాలిత ప్రాంతాలు మరో రెండు పెరిగాయి. జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన మూడు నెలల తర్వాత ఈ రాష్ట్రం నేటితో రెండుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్ శాసనసభ ఉండే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు కాగా, లడక్ శాసనసభ లేని యూటీగా ఏర్పడింది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు లెఫ్టినెంట్ గవర్నర్ల ఆధ్యర్యంలో ఉంటాయి.

నిన్న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం, ఇకపై జమ్మూ కశ్మీర్ ప్రజలు పర్మినెంట్ రెసిడెంట్స్ హోదాను కోల్పోతారు. అంతేకాదు, ఇకపై అక్కడి ఆస్తులను కొనుగోలు చేసే అధికారం ఇతర రాష్ట్రాల్లోని ప్రజలందరికీ లభిస్తుంది. అక్కడ ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని దాదాపు 560 సంస్థానాలను భారత్ లో విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా జమ్మూకశ్మీర్ రెండు ముక్కలైంది. ఈ రోజు మన దేశం 'జాతీయ ఐక్యతా దినోత్సవం'గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

జమ్మూకశ్మీర్ కేంద్రపాలితమైన నేపథ్యంలో, ఇకపై అక్కడి పోలీసులతో పాటు, లా అండ్ ఆర్డర్ కేంద్రం పరిధిలోకి వచ్చింది. అయితే, పాలనాపరమైన విషయాలను మాత్రం అక్కడి ప్రభుత్వం చూసుకుంటుంది. లాడక్ మాత్రం పూర్తి స్థాయిలో కేంద్రం అజమాయిషీలో ఉంటుంది.  

Comments

Popular posts from this blog

రేపు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ రేపు దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఆపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా, సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.

ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదు: రేవంత్ రెడ్డి

  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిసి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాదులోని జలసౌధ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అనుమతులు పొందిందని, ఎంతో తక్కువ ఖర్చుతో నికర జలాలను ఇవ్వగలిగిన ఈ ప్రాజెక్టును తొక్కిపెట్టి మీరు సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో మీరు వేసిన కేసులోనూ ఈ ప్రాజెక్టు వివరాలు పొందుపరచకపోవడం మీ దుర్మార్గానికి పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదని, పొరుగు రాష్ట్రాలేవీ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని రేవంత్ స్పష్టం చేశారు.