స్పష్టత ఇచ్చిన జీవితా-రాజశేఖర్
ఆదివారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అత్యవసరంగా సమావేశం కావడంతో
తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చ నడిచింది. ‘మా’ అధ్యక్షుడు నరేష్కు
సమాచారం లేకుండా సమావేశం నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి
తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇది ‘మా’ ఆత్మీయ సమావేశం అంటూ ఎగ్జిక్యూటివ్
మెంబర్ జీవిత రాజశేఖర్ చెప్పుకొచ్చారు. అయితే, ఈ సమావేశం గురించి వివిధ
రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో జీవిత రాజశేఖర్ స్వయంగా మాట్లాడారు.
సమావేశం ఎలా జరిగింది? ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నారు? అనే అంశాలపై
స్పష్టతనిచ్చారు.
‘‘ఆదివారం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు సంబంధించి సమావేశం జరిగింది. దీని గురించి
మీడియాలో, వాట్సాప్లలో పలు రకాల వార్తలు వచ్చాయి. ఆ సమావేశం జరగలేదని,
కోర్టుకు వెళ్లారని, మధ్యలోనే ఆగిపోయిందని, కోర్టును ధిక్కరించి మీటింగ్
పెట్టారని, పెద్ద గొడవ జరిగిందని రకరకాల వార్తలు విన్నా. సమస్యల
పరిష్కారంపై నిన్నటి ‘మా’ సమావేశంలో ఎలాంటి స్పష్టమైన నిర్ణయానికి రాలేదు.
మేం దీనిపై అధికారికంగా మాట్లాడకపోవడం వల్ల ఎవరికి తోచిన విధంగా వాళ్లు
రాసుకొన్నారు. అలాంటి వార్తలకు ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయానికి వచ్చా.
అసలేం జరిగిందో చెప్పాలనుకుంటున్నా. ఆదివారం సమావేశం నిర్వహించాలనే దానిపై
గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కూడా దాదాపు 200మంది ‘మా’ సభ్యులు ఈ
ఆత్మీయ సమావేశానికి వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. నేను మాట్లాడే ప్రతి
మాట వెనుక ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది. వారి అందరి అభిప్రాయాలనే నేను
మీకు చెబుతున్నా. కొందరు ఈ సమావేశానికి రాలేకపోయారు. వాళ్ల కోసం వివరాలు
చెబుతున్నా’’
‘‘ఉదయం
9గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5గంటలకు ముగిసింది. ‘మా’
ఎగ్జిక్యూటివ్ కమిటీ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో ఈ సమావేశం
పెట్టాం. ఈ సందర్భంగా పెట్టిన చర్చలో అందరూ చురుగ్గా పాల్గొన్నారు. కొన్ని
సందర్భాల్లో తీవ్ర వాగ్వాదం జరిగింది. కొందరు సభ్యులు భావోద్వేగానికి
గురయ్యారు. అందరికీ ఉపయోగపడేలా ఈ సమావేశం జరిగింది. ‘మా’వార్షిక సర్వ సభ్య
సమావేశం ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. వీలైనంత త్వరగా
‘మా’ ఎక్స్టార్డనరీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలని ఈ సందర్భంగా
నిర్ణయించాం. ఇందుకోసం న్యాయపరమైన సలహాలు కూడా తీసుకున్నాం. సమస్యల
పరిష్కరానికి ప్రత్యేక సమావేశం కావాలంటూ మొత్తం ‘మా’సభ్యుల్లో 20శాతం మంది
అభ్యర్థిస్తే సమావేశం నిర్వహించుకోవచ్చని న్యాయ నిపుణులు తెలిపారు.
మెజార్టీ అభ్యర్థనలు వచ్చిన 21రోజుల్లో ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఈ
సమావేశం జరిగితే ‘మా’కు మంచి జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఇందుకు
హాజరుకావాలనుకునేవారు ‘మా’ ఆఫీస్కు వచ్చి మద్దతు తెలుపుతూ సంతకం
పెట్టాల్సి ఉంటుంది. పోస్ట్ ద్వారా లేఖ రాసి ‘మా’కు పంపవచ్చు. మెయిల్ను
కూడా పరిగణనలోకి తీసుకుంటాం. ఇదే విషయాన్ని నేను చెప్పాలనుకున్నా’’ అని ఆమె
చెప్పుకొచ్చారు.
Comments
Post a Comment