గోదావరి నదిలో వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఎగువన నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో గంట గంటకూ నదిలో నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించే తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఇంకా పెరుగుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి వరద పెరిగినప్పుడల్లా తరచూ తమకీ సమస్య తప్పడం లేదని, వరదలో చిక్కుకున్నన్నాళ్లు ఇబ్బందులేనని గ్రామస్థులు వాపోతున్నారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment