Skip to main content

ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు

ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. 729 మందిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. సమ్మె కార్మికుల హక్కు అని అన్నారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమనీ, కార్మికులు కాదన్నారు. రాయితీల డబ్బును ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ఏపీలో ఆర్టీసీ విలీనమైందని గుర్తు చేశారు. ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం పంతాలు పట్టింపులకు పోవద్దని కోరారు. 2013లో ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఆర్టీసీ విలీనంపై ఉత్తర్వులు వెలువడ్డాయని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినందున ఆ ఉత్తర్వులు అమలు కాలేదన్నారు. ఆర్టీసీ విలీనం అన్నది కొత్త డిమాండ్‌ కాదన్నారు. బతుకమ్మ, దసరా పండుగ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సీఎం కేసీఆర్‌ చొరవ చూపాలని సూచించారు. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ తరహాలో రవాణా రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సమ్మెను నివారించాలని కోరతామన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించామనీ, ఆ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తామనీ అన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.