కొన్ని రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మె యథాతథంగా కొనసాగుతుందని
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈ రోజు ఆయన
మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ భవిష్యత్ కార్యాచరణను వివరించారు. రేపు
అన్ని డిపోల ముందు కుటుంబ సభ్యులతో ఆర్టీసీ కార్మికులు బైఠాయిస్తారని
చెప్పారు. ఈ నెల 23న ప్రజా ప్రతినిధులతో భేటీ నిర్వహిస్తామన్నారు. ఈ నెల
24న మహిళా కండక్టర్ల ర్యాలీ ఉంటుందని వివరించారు. అలాగే, ఈ నెల 30న సకల
జనుల సమరభేరి పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.
ఇటీవల
హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు
జరపాలని అశ్వత్థామరెడ్డి కోరారు. తమ పొట్ట కొట్టొద్దని తాత్కాలిక
డ్రైవర్లు, కండక్టర్లను కోరుతున్నామని చెప్పారు. ఓయూ విద్యార్థులు
చేస్తున్న పోరాటాలకు ఆర్టీసీ జేఏసీ మద్దతు ఉంటుందని తెలిపారు. మహిళా
పారిశుద్ధ్య కార్మికులు వంద మందిని అరెస్టు చేశారని, పోటు రంగారావుపై
ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఆయన అన్నారు. ఈ దమనకాండను రాష్ట్ర ప్రభుత్వం
ఆపాలని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Post a Comment