పోలీసుల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీసేలా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత వర్ల రామయ్య మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఈమేరకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వైసీపీ నాయకులు విడదల రజని, మహ్మద్ ముస్తఫా తదితరులు ఫిర్యాదు చేశారు. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా వారు మాట్లాడుతున్నరని, డీజీపీ గౌతం సవాంగ్ పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, వర్ల రామయ్యను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదని విమర్శించారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment