Skip to main content

ట్రంప్‌కు మోదీ స్పష్టంగా చెప్పారు: అమిత్‌ షా

ట్రంప్‌కు మోదీ స్పష్టంగా చెప్పారు: అమిత్‌ షా
కశ్మీర్‌ వ్యవహారం పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమనీ.. దీనిలో ఎవరి జోక్యమూ అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు స్పష్టంగా చెప్పారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మరోసారి వెల్లడించారు. కశ్మీర్‌లో ఎవరి జోక్యాన్ని సహించబోమని గత కొన్నేళ్లుగా తమ పార్టీ స్థిరమైన వైఖరితో ఉందన్నారు. ఒకవేళ ఏ దేశమైనా కశ్మీర్‌పై మాట్లాడితే.. అది పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమనీ స్పష్టంగా చెప్పామనీ.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవల ట్రంప్‌కు ఇదే విషయాన్ని స్పష్టం చేశారని అమిత్‌ షా వివరించారు. మహారాష్ట్రలోని బుల్‌ధానాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్‌ షా ప్రసంగించారు. ఆర్టికల్‌ 370 రద్దును కాంగ్రెస్‌, ఎన్సీపీ వ్యతిరేకించాయన్నారు. కశ్మీర్‌ అంశంపై ఆ రెండు పార్టీల వైఖరి ఏమిటో ఓటర్లే అడగాలని సూచించారు.

కశ్మీర్‌ను భారత్‌తో అనుసంధానించే ప్రక్రియకు ఆర్టికల్‌ 370 అనేది అతిపెద్ద అడ్డంకిగా ఉండేదన్నారు. దాన్ని రద్దుచేయడం ద్వారా గత 70 ఏళ్లుగా ఏ ప్రధాని చేయలేని సాహసాన్ని నరేంద్ర మోదీ చేశారని కొనియాడారు. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తే నెత్తురు పారుతుందని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ పార్లమెంట్‌లో అన్నారనీ.. అయితే, ఆర్టికల్‌ 370ని రద్దు చేశాక ఒక్క చుక్క రక్తంకూడా రాలేదని అమిత్‌ షా అన్నారు.

Comments