Skip to main content

దటీజ్‌ ధర్మాడి సత్యం

 రాయల్‌ వశిష్ఠ వెలికితీతలో ఆయనదే కీలకపాత్ర
దటీజ్‌ ధర్మాడి సత్యం



ఉన్నత చదువులు చదవలేదు.. సాంకేతికతపై పెద్దగా పట్టు లేదు. అయినా సముద్రం, నదిలో మునిగిపోయిన పడవలు.. బోట్లను వెలికితీయడంలో మాత్రం అతని అనుభవం అపారం. ఆయనే తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం. ఎక్కడైనా మునిగిపోయిన బోటును వెలికితీయాలంటే ఆ జిల్లా వాసులకు తొలుత గుర్తొచ్చే పేరు ఆయనదే. ధర్మాడి బృందం అడుగుపెట్టిందంటే ఆపరేషన్‌ సక్సెస్‌ కావాల్సిందే. కచ్చులూరు వద్ద  గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటును వెలికితీయడంతో ధర్మాడి సత్యం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.
సెప్టెంబర్‌ 15న రాయల్‌ వశిష్ఠ బోటు గోదావరిలో మునిగిపోయిన సమయంలో ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఆ క్రమంలో బోటును వెలికితీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఉత్తరాఖండ్‌కు చెందిన విపత్తు నిర్వహణ బృందాలు కొన్ని రోజుల పాటు సహాయక చర్యలు చేపట్టినా ఆ తర్వాత చేతులెత్తేశాయి. డెహ్రాడూన్‌ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన ప్రత్యేక అధికారి వచ్చినా ఫలితం లేకపోయింది. అప్పటికి ఇంకా 13 మంది ఆచూకీ తెలియకపోవడంతో వారి బంధువుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రభుత్వం బోటు వెలికితీసే బాధ్యతను కాకినాడ వాసి ధర్మాడి సత్యంకు చెందిన బాలాజీ మెరైన్‌ సంస్థకు అప్పగిస్తూ.. రూ.22.7లక్షలకు కాంట్రాక్టు ఇచ్చింది. దీంతో ధర్మాడి బృందం రంగంలోకి దిగింది. బోటును వెలికితీయడంతో పాటుగా మృతదేహాల కోసం ఆ బృందం సెప్టెంబరు 28న అన్వేషణ మొదలు పెట్టింది. తొలుత ఐదు రోజులపాటు గాలింపు ప్రక్రియ చురుగ్గా సాగినా గోదావరికి వరద పోటెత్తడంతో అక్టోబరు 3న ఆపరేషన్‌ నిలిపివేశారు.
దటీజ్‌ ధర్మాడి సత్యం
గోదావరి శాంతించడంతో తిరిగి అక్టోబరు 16న మరోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. ఐరన్‌ రోప్‌, లంగర్ల సాయంతో బోటు మునిగిన ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లంగరుకు చిక్కుకుని విడిభాగాలు బయటికొచ్చినా బోటు మాత్రం బయటకు రాలేదు. కొన్ని సార్లు లంగరుకు చిక్కినట్టే  చిక్కి జారిపోయింది. అయినా ధర్మాడి సత్యం పట్టువీడలేదు. బోటు ఉన్న ప్రాంతంలో లంగరు వేసి ఐరన్‌ రోప్‌ను బోటు చుట్టూ చుట్టి పొక్లెయిన్‌తో బయటకు లాగేప్రయత్నం చేశారు... అయినా పట్టు చిక్కలేదు. ప్రయత్నాలు ఫలించక పోవడంతో చివరికి విశాఖకు చెందిన స్కూబా డైవర్లతో సంప్రదింపులు జరిపారు. డైవర్లు నదీగర్భంలో దిగేందుకు తొలుత సాహసించలేదు. దీంతో ధర్మాడి స్వయంగా విశాఖ వెళ్లి వారితో మాట్లాడి ఒప్పించారు. వారిని కచ్చులూరు తీసుకొచ్చి బోటు మునిగిన ప్రదేశంపై పూర్తి అవగాహన కల్పించారు. బోటు ఎలా బయటకు తీయాలనుకుంటున్నది డైవర్లకు వివరించారు. ధర్మాడి వ్యూహం మేరకు డైవర్లు నదీ గర్భంలోకి దిగి ఐరన్‌ రోప్‌ను బోటు ఫ్యాన్‌కు కట్టారు. నది ఒడ్డున ఏర్పాటు చేసిన పొక్లెయిన్‌కు ఐరన్‌రోప్‌ కట్టి మెల్లగా లాగడంతో ఐరన్‌ రోప్‌ ఫ్యాన్‌కు గట్టిగా బిగుసుకుంది. అలా పొక్లెయిన్‌తో బయటకు లాగి.. 38 రోజులుగా నదీగర్భంలో ఉన్న బోటును ఒడ్డుకు చేర్చగలిగారు.
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈరోజుల్లో మెరైన్‌, నేవీ బృందాలు కూడా చేయలేని పనిని ధర్మాడి సత్యం బృందం చేసిందని పలువురు అభినందిస్తున్నారు. నదీగర్భంలో బోటు.. అందులో మృతదేహాలు ఉండటంతో ఆ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లేందుకు భయపడ్డామని కచ్చులూరు, సమీప గ్రామాల మత్స్యకారులు చెప్పారు. బోటు బయటకు తీయడంతో ఆ ప్రాంతానికి యథావిధిగా చేపల వేటకు వెళ్తామని హర్షం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా.. బోటులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసుకొచ్చి వారి దుఃఖంలో పాలుపంచుకున్నామని ధర్మాడి సత్యం తెలిపారు.
దటీజ్‌ ధర్మాడి సత్యం

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.