Skip to main content

దీక్ష కొనసాగిస్తున్న కొల్లు రవీంద్ర


దీక్ష కొనసాగిస్తున్న కొల్లు రవీంద్ర
 కృత్రిమ ఇసుక కొరతను నిరసిస్తూ చేపట్టిన 36 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేసినప్పటికీ.. మచిలీపట్నంలోని ఇంటిదగ్గర కొల్లు రవీంద్ర దీక్షను కొనసాగిస్తున్నారు. ఇసుక కొరతపై గాంధీ అహింసా మార్గంలో దీక్ష పట్టాలని నిర్ణయం తీసుకుంటే.. పోలీసులు తమను రాత్రి నుంచి వేధిస్తూ దీక్షను అడ్డుకుంటున్నారని కొల్లు ఆరోపించారు. రెండు పోలీస్ స్టేషన్లు తిప్పి ఇంటికి‌ తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. జగన్ నియంతలా మారి ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఇవాళ రాష్ట్రంలో ఇసుక లేక అసంఘటిత కార్మికులు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త ఇసుక పాలసీ వచ్చి నెల రోజులు గడుస్తున్నా సామాన్యులకు ఇసుక దొరకడం లేదని ఆరోపించారు. వైకాపా నాయకులకే ఇసుక కేంద్రాల నుంచి ఇసుక తరలిపోతోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఈ విషయం తమ నిరసన ద్వారా చెప్పాలని చూస్తే పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ, పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టంచేశారు. 36 గంటల దీక్షతో ఆపేది లేదని, సామాన్యులకు ఇసుక చేరేవరకూ దఫదఫాలుగా తమ నిరసన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

Comments