Skip to main content

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు.. విచారణ రేపటికి వాయిదా


 

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎల్లుండివరకు గడువు కావాలని కోరగా, కోర్టు నిరాకరించింది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు మరోసారి విచారణ చేపడతామని పేర్కొంది.

అంతకు ముందు వాదనలు కొనసాగుతున్న సమయంలో.. కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ.175 కోట్ల నష్టం వచ్చిందని,  రాజకీయ పార్టీలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ..  చర్చల వివరాలను తెలుపుతూ అదనపు అడ్వకేట్ జనరల్ అదనపు కౌంటర్ దాఖలు చేశారు. ఈడీల కమిటీ 21 అంశాలను పరిశీలించి ఆర్టీసీ ఎండీకి నివేదిక సమర్పించిందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టుకు తెలిపారు.

వీటిలో 18 డిమాండ్లను నెరవేర్చడానికి సరిపడా నిధులు సంస్థ వద్దలేవని ఈడీ నివేదికలో పేర్కొందని రామచంద్రరావు తెలిపారు. మరి ఈడీ కమిటీ నివేదిక తమకెందుకు సమర్పించలేదని కోర్టు ప్రశ్నించింది. నివేదికలు కోర్టుకు కూడా తెలపరా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఓవర్ నైట్లో ఆర్టీసీ విలీనం ఎలా జరుగుతుందంటూ హైకోర్టు ప్రశ్నించింది. కార్మికుల  డిమాండ్లు సాధ్యం కాదని ముందే నిర్ణయం తీసుకున్నారా? అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

కార్మికుల వేతనాలు పెంచామని కోర్టుకు అర్టీసీ పేర్కొంటూ.. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని ఏఏజీ తన వాదనలో పేర్కొనగా, కోర్టు స్పందిస్తూ.. 'చట్ట విరుద్ధమని చెపుతున్నారు, మరి వారిపై చర్యలు ఏమైనా తీసుకున్నారా?' అని ప్రశ్నించింది. ప్రస్తుతం సమస్య పరిష్కారానికి ఆర్టీసీకి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వగలదా? అని కోర్టు ప్రశ్నించగా, ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి రూ.450 కోట్లు ఇచ్చిందని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో కల్పించుకున్న కోర్టు, 'మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి ప్రభుత్వ కార్యదర్శిని, ఆర్థిక శాఖ కార్యదర్శిని పిలుస్తాం' అని వ్యాఖ్యానించింది.

అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఆర్టీసీ తరపున వాదనలు వినిపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ ను హాజరుకావాలని కోర్టు పిలిపించింది. అనంతరం ప్రసాద్ ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగించారు. కార్మికుల తీరు సరిగా లేదని ప్రసాద్ కోర్టుకు తెలిపారు. 

Comments

Popular posts from this blog

రేపు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ రేపు దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఆపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా, సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.

ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదు: రేవంత్ రెడ్డి

  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిసి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాదులోని జలసౌధ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అనుమతులు పొందిందని, ఎంతో తక్కువ ఖర్చుతో నికర జలాలను ఇవ్వగలిగిన ఈ ప్రాజెక్టును తొక్కిపెట్టి మీరు సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో మీరు వేసిన కేసులోనూ ఈ ప్రాజెక్టు వివరాలు పొందుపరచకపోవడం మీ దుర్మార్గానికి పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదని, పొరుగు రాష్ట్రాలేవీ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని రేవంత్ స్పష్టం చేశారు.