Skip to main content

అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

 
అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ
 ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో జగన్‌ నేడు భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులు, సమస్యలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూలోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలో హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి వరదజలాల తరలింపు తదితర అంశాలపై అమిత్‌షాతో మాట్లాడారు. పరిశ్రమలు, సేవారంగాలపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాగ్‌తో చర్చించిన అనంతరం 2014-2015లో రెవెన్యూ లోటును సవరిస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అమిత్‌షాను జగన్‌ కోరారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ.. ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 
అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ
కడపలో స్టీల్‌ప్లాంట్‌, ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణాల అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. వీటితోపాటు విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాల్సిందిగా హోం మంత్రిని కోరారు. వెనకబడ్డ జిల్లాలకు నిధులు కేటాయించే విధానాన్ని మార్చాలని కోరారు. ఏపీలో వెనకబడ్డ జిల్లాల్లో ఒక్కొక్కరికి రూ.400 రూపాయల చొప్పున ఇస్తే, బుందేల్‌ఖండ్‌, కలహండి ప్రాంతాలకు రూ.4000 ఇస్తున్న విషయాన్ని ఆయనకు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదించాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. ఇందులో రూ.33వేల కోట్లు భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌కే ఖర్చు అవుతుందని ఆయనకు వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్‌ ప్రక్రియ ద్వారా రూ.838 కోట్ల ప్రజాధానాన్ని ఆదా చేశామని తెలిపారు. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి వరదజలాల తరలింపు అంశాన్ని ఆయనతో చర్చించారు. 
కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, కృష్ణాడెల్టా సహా తాగునీరు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు గోదావరి వరద జలాలను నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించేందుకు వీలుగా ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖలను ఆదేశించాలని సీఎం కోరారు. దీనివల్ల రాష్ట్రంలోని సాగునీరు, తాగునీరు కొరత ఉన్న ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, ఆ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని హోంమంత్రికి జగన్‌ వివరించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.