Skip to main content
పల్లవుల నగరంలో పర్యటించిన మోదీ, జిన్పింగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ , ప్రధాని నరేంద్రమోదీ మహాబలిపురం పర్యటన
కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం మహాబలిపురం చేరుకున్న ఇరుదేశాధినేతలు
పలుచారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తమిళనాడు
సంప్రదాయాన్ని ప్రతిబింబించే వస్త్రాలను ధరించారు. మహాబలిపురంలోని పలు
చారిత్రక కట్టడాలను వీక్షిస్తూ ఇరువురు నేతలు వివిధ అంశాలపై
మాట్లాడుకున్నారు. చారిత్రక కట్టడాల విశిష్టత, శిల్ప కళా సౌందర్యాన్ని
జిన్పింగ్కు మోదీ వివరించారు. పరమశివుడి నుంచి అర్జునుడు పాశుపతాస్త్రం
పొందే శిల్పాన్ని , కృష్ణుడి వెన్నముద్ద శిలను, ఏకశిలాకట్టడాలైన పంచరథాలు,
ఇతర విగ్రహాలను ఇరువురు నేతలు సందర్శించారు. వెయ్యేళ్ల క్రితం వీటిని
నిర్మించిన పల్లవరాజుల గొప్పదనాన్ని జిన్పింగ్కు మోదీ వివరించారు. ఆలయ
ప్రాంగణంలోనే కొబ్బరి బోండాలు సేవిస్తూ పలు అంశాలపై ఇరువురూ
మాట్లాడుకున్నారు.అనంతరం మహాబలిపురం సముద్రతీర ఆలయంలో ఏర్పాటు చేసిన
సాంస్కృతిక కళాప్రదర్శనలను మోదీ, జిన్పింగ్ వీక్షించారు. చెన్నైకి చెందిన
కళాక్షేత్ర విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. జిన్పింగ్
గౌరవార్థం రాత్రికి మోదీ విందు ఇవ్వనున్నారు. శనివారం జిన్పింగ్, మోదీ
ఇష్టా గోష్ఠి చర్చలు జరపనున్నారు.
అంతకుముందు
బీజింగ్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న షీ జిన్పింగ్కు
విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అభివాదం చేస్తూ విమానం నుంచి దిగిన
చైనా అధ్యక్షుడికి తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి
పళనిస్వామి, కేంద్ర ప్రభుత్వ అధికారులు స్వాగతంపలికారు. వారందరితో
జిన్పింగ్ కరచాలనం చేశారు. తమిళ సంప్రదాయం ప్రకారం జిన్పింగ్కు స్వాగతం
పలికారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను
జిన్పింగ్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం గిండిలోని హోటల్కు జిన్పింగ్
వెళ్లారు. హోటల్లో విశ్రాంతి తీసుకున్న అనంతరం మహాబలిపురం విచ్చేశారు.
Comments
Post a Comment