Skip to main content

బగ్దాదీని ఇలా వెంటాడాం.. ఆపరేషన్ వీడియోను విడుదల చేసిన అమెరికా!

 

ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీని ఎలా వెంటాడిందీ అమెరికా బయటి ప్రపంచానికి వెల్లడించింది. ఆ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను విడుదల చేసింది. పెంటగాన్ విడుదల చేసిన ఈ వీడియోలో అమెరికా సైనికులు బగ్దాదీ ఇంటిని చుట్టుముడుతుండడం, ఓ జాగిలం పరుగులు పెట్టడం, ప్రత్యేక బలగాలు హెలికాప్టర్ నుంచి కిందికి దిగుతున్న సమయంలో ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరపడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే, దాడికి ముందు, ఆ తర్వాత బగ్దాదీ ఇంటిని కూడా చూపించారు.

బగ్దాదీ ఇంటిని చుట్టుముట్టిన తర్వాత అతడి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసినట్టు పెంటగాన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ తెలిపారు. బగ్దాదీ తనకు తాను పేల్చుకున్నప్పుడు అతడితో పాటు చనిపోయింది ముగ్గురు పిల్లలు కాదని, ఇద్దరేనని స్పష్టం చేశారు. వారి వయసు 12 ఏళ్ల లోపేనని తెలిపారు. అదే కాంపౌండ్‌లో ఉన్న మరో నలుగురు మహిళలు, ఓ పురుషుడు హతమైనట్టు తెలిపారు. హెలికాప్టర్లపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వైమానిక దాడి జరపక తప్పలేదని పేర్కొన్నారు.

బగ్దాదీ ఇంటి నుంచి ఐసిస్ కార్యకలాపాలకు సంబంధించి పలు ఎలక్ట్రానిక్, డాక్యుమెంట్ రూపంలో ఉన్న ఆధారాలను సేకరించినట్టు మెకంజీ వివరించారు. 2004లో ఇరాక్ జైలులో బగ్దాదీని బంధించినప్పుడు అతడి నుంచి డీఎన్ఏ సేకరించామని, దాని ఆధారంగానే తాజాగా బగ్దాదీ మృతిని ధ్రువీకరించినట్టు తెలిపారు. బగ్దాదీని హతమార్చిన అనంతరం 24 గంటల్లోనే అతడి అవశేషాలను సముద్రంలో కలిపేసి అంతర్జాతీయ నిబంధనలు పాటించినట్టు మెకంజీ వెల్లడించారు. ఇక, బగ్దాదీని తరిమిన శునకం ఇప్పటి వరకు 50 దాడుల్లో పాల్గొందని, తాజా దాడిలో గాయపడినా వెంటనే కోలుకుని విధుల్లో చేరిందని తెలిపారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.