టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం చూసి సచివాలయ వ్యవస్థను తానే తీసుకొచ్చానని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శించారు. ఆ సచివాలయం వేరు, సీఎం జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ వేరు అన్న బాబు తెలుసుకోవాలని సెటైర్లు విసిరారు. గ్రామ సచివాలయ వ్యవస్థను చంద్రబాబు తెచ్చాడా? అని ప్రశ్నించారు. ఏపీలో నిన్న ప్రారంభించిన ‘కంటి వెలుగు’ పథకం టీడీపీ హయాంలో ఉన్నదే అని బాబు వ్యాఖ్యానించడంపైనే ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబుకు బుద్ధి, కంటిచూపు మందగించి ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రజా రంజక పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment