Skip to main content

బాగ్దాదీ వేటలో అదే టర్నింగ్‌ పాయింట్‌..!

 
బాగ్దాదీ వేటలో అదే టర్నింగ్‌ పాయింట్‌..!
 ప్రపంచ మోస్ట్‌వాంటెడ్‌ టెర్రిరిస్ట్‌ అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ అంతానికి 2018లోనే కీలక అడుగులు పడ్డాయి. అతడికి అత్యంత సన్నిహితుల్లో ఒకరే.. ఈ కరుడగట్టిన ముష్కరుడి కదలికలపై సమాచారం అందజేశాడు. ఇది అతని ఆచూకీ పసిగట్టడం ఇంటెలిజెన్స్ వర్గాలకు ఎంతో ఉపయోగపడింది. ఈ మేరకు నిఘా వర్గాలు, ఇరాకీ సైన్యం చెప్పిన కథనాల ప్రకారం ప్రముఖ వార్త సంస్థ ఓ కథనం ప్రచురించింది. బాగ్దాదీ ఐదుగురు సన్నిహిత అనుచరుల్లో ఇస్మామయిల్‌ అల్‌-ఎతావి ఒకరు. టర్కీ బలగాలు ఇతన్ని అరెస్టు చేసి ఇరాకీ సైన్యానికి అప్పగించాయి. ఈ క్రమంలో బాగ్దాదీ సంబంధించిన కీలక సమాచారాన్ని ఎతావి సైన్యానికి తెలిపాడు. తన కదలికల్ని ప్రత్యర్థులు పసిగట్టకుండా కూరగాయలు రవాణా చేసే మినీ బస్సుల్లో బాగ్దాదీ ప్రయాణించేవాడని చెప్పాడు. అలాగే కమాండర్లతో వ్యూహాత్మక సమావేశాలు జరిపేవాడని తెలిపాడు. దీంతో బాగ్దాదీ కదలికలపై అప్పటి వరకు నిఘా వర్గాలకున్న గందరగోళం తొలగిపోయిందని ఇరాక్‌కి చెందిన ఓ భద్రతాధికారి తెలిపారు. బాగ్దాదీ తన అనుచరులను కలిసే సిరియాలోని కొన్ని ప్రాంతాలను కూడా ఎతావినే తమకు చెప్పాడన్నారు. అప్పటి వరకు సామూహిక హత్యలు, తలలు నరకడం వంటి ఘోర మారణకాండకు ఆదేశాలు జారీ చేస్తున్న ఓ క్రూరుడు చిక్కినట్లే చిక్కి తప్పించుకుటుండడంతో బలగాలు తీవ్ర అసహనంతో ఉన్నాయి. ఈ తరుణంలో ఎతావి ఇచ్చిన సమాచారం కీలకంగా మారింది.
కీలక సమాచారం...
ఎతావి పట్టుబడటమే బాగ్దాదీని అంతమొందించే ప్రక్రియలో టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. ఇస్లామిక్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేసిన ఎతావి 2006లో అల్‌ ఖైదాలో చేరాడు. ఇరాకీ భద్రతాధికారులు చెప్పిన ప్రకారం 2008లో అతన్ని అమెరికా బలగాలు అరెస్టు చేశాయి. దీంతో నాలుగేళ్లు అతడు జైలు జీవితం గడిపాడు. తిరిగొచ్చి ఐసిస్‌లో చేరాడు. బాగ్దాదీకి కీలక అనుచరుడి స్థాయికి ఎదిగాడు. మతపరమైన బోధనలు చేయడం, ఇస్లామిక్‌ స్టేట్‌ కమాండర్లని ఎంపిక చేయడంలాంటి కీలక బాధ్యతల్ని ఎతావికి అప్పగించాడు. కానీ, అమెరికా బలగాలు ఐసిస్‌పై విరుచుకుపడటం ప్రారంభించడంతో 2017లో ఎతావి కుటుంబంతో కలిసి సిరియాకు మకాం మార్చాడు. 2018లో ఇరాక్‌ బలగాలు అతన్ని అరెస్టు చేసి కీలక సమాచారాన్ని రాబట్టాయి. అలాగే అమెరికా, ఇరాక్‌, టర్కీ బలగాలు ఈ ఏడాది ఆరంభంలో చేపట్టిన ఆపరేషన్‌లో మరికొంత మంది ఐసిస్‌ నేతలు పట్టుబడడం కూడా బాగ్దాదీ ఆచూకీ కనిపెట్టడంలో దోహదపడింది. వీరు ఐసిస్‌ అధినేత సంచరించే కీలక ప్రాంతాల సమాచారం ఇచ్చారు. అందుకనుగుణంగా సీఐఏ ఆయా ప్రదేశాల్లో బలగాల్ని మోహరించి ఆపరేషన్‌ని ముందుకు తీసుకెళ్లిందని ఇరాక్‌కు చెందిన ఓ భద్రతాధికారి తెలిపారు. వీరిచ్చిన సమాచారంతో సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రాంతంలో బాగ్దాదీ కుటుంబంతో కలిసి వివిధ గ్రామాలకుకు మారుతున్నాడని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఓ రోజు ఇరాక్‌కు చెందిన వ్యక్తి అక్కడి మార్కెట్‌ ప్రాంతంలో సంచరిస్తుండడం గమనించారు. అతను ఎతావి అని ధ్రువీకరించుకున్నారు. అతన్ని అనుసరిస్తూ వెళ్లారు. చివరకు అతడు బాగ్దాదీ ఉన్న ఇంటికే చేరుకున్నాడు. ఈ సమాచారాన్ని వారు సీఐఏకి అందజేశారు. దీంతో వారు గత ఐదు నెలలుగా శాటిలైట్‌, డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతంపై నిఘా ఉంచారు. ఇటీవల మినీబస్‌లో పక్కనున్న గ్రామానికి బాగ్దాదీ వెళ్లడం గమనించారు. అప్పటికే వారి వద్ద ఉన్న సమాచారంతో అతను బాగ్దాదీయే అని ధ్రువీకరించుకున్నారు. 

స్థానిక శత్రువులు...
ఇడ్లిబ్‌ ప్రాంతంలో కీలకంగా వ్యవహరిస్తున్న జిహాదీ సంస్థ ‘హయత్‌ తారిర్‌ అల్‌-శామ్‌’ కూడా బాగ్దాదీ కోసం గాలిస్తోంది. ఈ సంస్థ అల్‌ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తోంది. సిరియా యుద్ధంలో ఈ గ్రూపు ఐసిస్‌తో తలపడింది. అలాగే ఈ ప్రాంతంలో బాగ్దాదీ ఉంటే తమ ఉనికికి ప్రమాదం ఉండే అవకాశం ఉందని భావించిన ‘హయత్‌ తారిర్‌’ నేతలు అతడి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో బాగ్దాదీ కీలక అనుచరుడైన ఖలీదీ వీరికి పట్టుబడ్డాడు. అతడిచ్చిన సమాచారంతో రెండు నెలల క్రితం సర్మిన్‌ అనే పట్టణంపై దాడి చేశారు. కానీ, బాగ్దాదీ అక్కడి లేకపోవడంతో వెనక్కి తిరిగారు. ఇక అప్పటి నుంచి ‘హయత్‌ తారిర్‌’ నేతలు సైతం అతనిపై నిఘా ఉంచారు. స్థానికులు తెలిపిన ప్రకారం తాహిర్‌ సంస్థకి టర్కీ బలగాలతో సంబంధాలు ఉన్నాయి. అలా వీరి గాలింపు చర్యల పురోగతి సమాచారం కూడా నిఘా వర్గాలకు అందినట్లు భావిస్తున్నారు.

ఇలా ఎట్టకేలకు అతనిపై భారీ నిఘాతో టర్కీ, సిరియా సాయంతో అమెరికా ప్రత్యేక బలగాలు, ఇంటెలిజెన్స్‌ వర్గాలు బాగ్దాదీ కదలికల్ని కచ్చితంగా పసిగట్టాయి. శనివారం రాత్రి భారీ ఆపరేషన్‌లో అతన్ని అంతమొందించాయి.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.