Skip to main content

అందుకే మినహాయింపు కోరుతున్నా: జగన్‌

అందుకే మినహాయింపు కోరుతున్నా: జగన్‌
అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్‌ దాఖలు చేసిన సమయంలో సీబీఐ వాడిన  భాషతీరుపై జగన్‌ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఊహాజనిత ఆరోపణలతో పిటిషన్‌కు సంబంధం లేని అంశాలను సీబీఐ తన కౌంటర్‌లో ప్రస్తావించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినట్లు జగన్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాను హాజరుకాకపోతే విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో సీబీఐ తెలపాలన్నారు. గత ఆరేళ్లలో ఎన్నడూ కేసుల వాయిదా కోరలేదని.. స్టే కూడా అడగలేదన్నారు.
గతంలో పాదయాత్ర కోసం మినహాయింపు కోరితే.. రాజకీయ అవసరాల కోసం ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందని జగన్‌ గుర్తు చేశారు. అసౌకర్యంగా ఉందని హాజరు మినహాయింపు కోరడం లేదని.. సీఎంగా పరిపాలన చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసమే హాజరు మినహాయింపు కోరుతున్నానని న్యాయస్థానానికి వివరించారు. సాక్షులను ప్రభావితం చేసినట్లు ఆరేళ్లలో ఒక్క ఆరోపణ అయినా ఉందా అని జగన్‌ ప్రశ్నించారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే సీబీఐ కోర్టు, హైకోర్టు జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించాయన్నారు. జగన్ హోదా మినహా కేసు పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. అవసరం ఉన్నప్పుడు పిటిషన్ వేసి ఆ ఒక్క రోజుకు హాజరు మినహాయింపు తీసుకుంటూనే ఉన్నారని.. ఇప్పుడు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం..తీర్పును నవంబర్‌ 1కి వాయిదా వేసింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.