ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ తన నియోజకవర్గంలో స్థానిక సచివాలయాన్ని ప్రారంభించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సచివాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీపీఎస్సీ పనితీరుపై విమర్శలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ గనుక పరీక్షలు నిర్వహించి ఉంటే ఫలితాలు వచ్చేందుకు చాలా సమయం పట్టేదని అన్నారు. ఎప్పుడు నియామకాలు పూర్తిచేస్తారో వారికే తెలియదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరగలేదని తెలిపారు. సచివాలయ నియామకాలపై విపక్షాలు అవాస్తవాలు మాట్లాడుతున్నాయని ఆరోపించారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment