ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ తన నియోజకవర్గంలో స్థానిక సచివాలయాన్ని ప్రారంభించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సచివాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీపీఎస్సీ పనితీరుపై విమర్శలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ గనుక పరీక్షలు నిర్వహించి ఉంటే ఫలితాలు వచ్చేందుకు చాలా సమయం పట్టేదని అన్నారు. ఎప్పుడు నియామకాలు పూర్తిచేస్తారో వారికే తెలియదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరగలేదని తెలిపారు. సచివాలయ నియామకాలపై విపక్షాలు అవాస్తవాలు మాట్లాడుతున్నాయని ఆరోపించారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment