ప్రతిపక్ష టీడీపీ ఎంతగా విమర్శిస్తున్నా రివర్స్ టెండరింగ్తో ముందుకు వెళ్లాలనుకుంటున్న జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పోలవరం టెండర్లలో మరోదాన్ని రద్దు చేసింది. ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి ప్యాకేజీ-5లో 65 కోట్ల రూపాయల విలువైన పనులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పీఎస్కే-హెచ్ఈఎస్ ఇన్ఫ్రా కంపెనీలు ప్రస్తుతం చేస్తున్న పనులకు అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేయనుంది. అనంతరం కొత్త ఏజెన్సీలకు పనులు అప్పగించేందుకు వీలుగా టెండర్ ప్రక్రియను నిర్వహించనుంది.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment