రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. బొగ్గు కొరత కారణంగానే విద్యుత్ ఉత్పాదన తగ్గిందని ప్రభుత్వం వివరణ ఇస్తున్నా, విమర్శల తాకిడి తప్పడంలేదు. ఈ నేపథ్యంలో, ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్ ను కొనుగోలు చేయవచ్చు కదా అని కూడా స్పందనలు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. పవన, సౌర విద్యుత్ కొనుగోలు చేయలేదని వస్తున్న వార్తలు అవాస్తవాలని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా గత 10 రోజులుగా విండ్, సోలార్ విద్యుదుత్పత్తి సరిగా లేదని తెలిపారు. వచ్చే 7 రోజుల పాటు 8 ర్యాకుల చొప్పున బొగ్గు సింగరేణి నుంచి వస్తోందని, కేఎస్కే థర్మల్ కేంద్రానికి రూ.120 కోట్లు చెల్లించామని వెల్లడించారు.
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు.
Comments
Post a Comment