వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని, అందుకు ఉదాహరణ చీరాల విలేకరిపై జరిగిన దాడి అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. ‘చీరాల విలేకరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషమని, అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదేపదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారంటే పోలీసులు ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ఇంతకుముందు కూడా మరో వైసీపీ నేత, పాత్రికేయుని ఇంటికి వెళ్ళి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారని ఆరోపించారు. ‘ముఖ్యమంత్రిగారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు. ఏమిటీ నిరంకుశత్వం? ఇది నాగరిక రాజ్యమా? కరడుగట్టిన కాలకేయ రాజ్యమా?’ అని విరుచుకుపడ్డారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment