తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీకి రెండు పేజీల లేఖ రాశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయన్నారు. వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారని, రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు దిగజారాయన్నారు. ప్రాథమిక హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రజలు, మీడియా ప్రతినిధులపై దాడులు కొనసాగుతున్నాయని చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ప్రతినిధులు, సంఘవిద్రోహ శక్తుల ద్వారా...శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చీరాలలో వైసీపీ నేత ఆమంచి వర్గీయులు విలేకరిపై దాడి చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని, గతంలో ఏపీ పోలీసులకు సమర్థులు అనే పేరు ఉండేదన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడాలని చంద్రబాబు సూచించారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment