Skip to main content

నేటితో ఆ మద్యం బంద్: ఇక అంతా ప్రభుత్వమే: బీర్లు మాత్రం కష్టమే..!

ఏపీలో దశల వారీ మద్యపాన నిషేధంలో భాగంగా కీలక నిర్ణయాలు అమలవుతున్నాయి. అందులో భాగంగా ఇక రోజుతో ప్రైవేటు మద్యం బంద్ కానుంది. రేపటి నుండి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిం చాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే వ్యాపారం చేస్తున్న ప్రైవేటు వ్యాపారులు షాపులను ఖాళీ చేస్తున్నారు. సరుకునంతా విక్రయించేసి షాపులను ఖాళీచేసే పనిలో ప్రైవేటు మద్యం వ్యాపారులు బిజీగా ఉండగా, ఎక్సైజ్‌ శాఖ అద్దెకు తీసుకున్న దుకాణాల్లో సరుకు నింపి.. సిబ్బందిని సమకూర్చుకుని.. కొత్తగా అమ్మకాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఈ సంధి కాలంలో కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరక్క.. దొరికినా ఇష్టమైన బ్రాండు లభించక మందు బాబులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం షాపులు ఉన్నాయి. మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 4,380 షాపుల్లో 20 శాతం తగ్గించి.. 3,448 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తోంది.

ఇక ప్రైవేటు మద్యం బంద్..

ఏపీలో పదిహేనేళ్ల తరువాత పూర్తిగా ప్రైవేటు మద్యం రద్దవుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ తన నవరత్నాల్లో ప్రకటించారు. అందులో భాగంగా కీలక అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ పాలసీలో భాగంగా ప్రైవేటు మద్యం అమ్మకాలను నిలిపివేసి..ప్రభుత్వమే షాపులను నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో..లైసెన్సులు అయిపోతున్నందున ప్రైవేటు వ్యాపారుల సరుకును దాదాపుగా ఇప్పటికే ఖాళీ చేశారు. ఆదివారమే అనేక షాపుల్లో మద్యం అమ్మకాలు ఆగిపోయాయి. కేవలం షాపుల్లో మిగిలిపోయిన బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. ప్రైవేటు మద్యం షాపులన్నీ ఖాళీ చేస్తున్నారు. మిగిలిపోయిన మద్యాన్ని ఎక్సైజ్‌ తీసుకుని, అందుకు నగదు ఇవ్వదు కాబట్టి జాగ్రత్త పడుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మద్యం కొరత ఏర్పడింది. అయితే ఈ ప్రభావం పడకుండా.. ఎక్సైజ్‌ శాఖ ఇప్పటికే ప్రభుత్వ షాపులకు సరుకును చేర్చింది. ఒక్కో షాపునకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల విలువైన మద్యాన్ని చేర్చింది.

ప్రభుత్వ దుకాణాలు ఎక్సైజ్ సిబ్బందికే బాధ్యతలు

షాపుల్లో సిబ్బంది నియామక ప్రక్రియను పూర్తిచేసి, వారికి శిక్షణ ఇచ్చింది. 1వ తేదీ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని షాపులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 3,500 షాపుల్లో 3,200 వరకూ అక్టోబర్ 1వ తేదీ ప్రారంభం కావొచ్చని, మిగిలినచోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ప్రైవేటు షాపుల తరహాలోనే ప్రభుత్వ షాపుల్లోనూ అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేటు షాపుల్లో ఉల్లంఘనలు జరిగితే వ్యాపారులపై కేసులు పెట్టేవారు. ఇప్పుడు ప్రభుత్వ షాపుల్లో ఉల్లంఘనలకు షాపు సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌ను బాధ్యులను చేయనున్నారు. అయితే తమపై తామే కేసులు పెట్టుకుంటే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో ఉల్లంఘనలకు అవకాశం లేకుండా సీఐలు, ఎస్‌ఐలకు పదేసి షాపుల బాధ్యతను అప్పగిస్తున్నారు. దీనివల్ల అవకతవకలు తగ్గుతాయని భావిస్తున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...