Skip to main content

హైదరాబాద్‌‌పై వరుణుడు పగ... మరో మూడ్రోజులు కుండపోతే...!

హైదరాబాద్‌‌పై వరుణుడు పగబట్టాడు. రెండ్రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షానికి నగరం మొత్తం అతలాకుతలమవుతోంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోతోంది. కుంభవృష్టితో మొత్తం నగరమే అల్లకల్లోలంగా మారుతోంది. రోడ్లన్నీ కాలువల్లా, కాలనీలు చెరువుల్లా మారుతున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి హైదరాబాద్‌లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మ్యాన్ హోల్స్ ఉప్పొంగుతున్నాయి. ఇక, లోతట్టు ప్రాంతాలైతే జలమయం కాగా, పలుచోట్ల కాలనీలు నీట మునిగాయి. శివారు ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో హైదరాబాదీల బాధలు వర్ణణాతీతంగా మారాయి.
ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, అమీ‌ర్‌‌పేట్‌, పంజగుట్ట, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మెహిదీపట్నం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్‌, ముషీరాబాద్‌, గాం‎ధీనగర్‌, చిక్కడపల్లి, అశోక్‌నగర్, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, యూసుఫ్‌గూడ, బోరబండ, నాంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఉప్పల్‌, నేరేడ్‌మెట్, ఏఎస్‌రావు, తిరుమలగిరి, బాలానగర్‌, అల్వాల్‌, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్, దిల్‌సుఖ్‌‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్... ఇలా అన్ని ప్రాంతాల్లోనూ 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రికార్డు స్థాయిలో 12 సెంటీమీటర్లు దాటి వర్షం పడింది.
ఇక, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. అలాగే, మూసాపేట్ దీన్‌దయాల్‌నగర్, ఈస్ట్ ఆనంద్‌బాద్‌లోని షిర్డీనగర్, బాలానగర్ మెయిన్‌రోడ్‌లోని నార్సాపూర్ క్రాస్‌రోడ్స్, ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్ ఫ్రూట్‌మార్కెట్, అల్వాల్ రాజీవ్‌నగర్ కాలనీ, తార్నాక క్రాస్‌రోడ్స్, ఆలుగడ్డబావి ఓల్‌ఫెంటా బ్రిడ్జీ, సికింద్రాబాద్ కర్బలా మైదాన్ తదితర ప్రాంతాల్లోనూ ప్రధాన రహదారులపై మోకాళ్లలోతు నీరు నిలిచింది. అదేవిధంగా కాచిగూడ, భోలక్‌పూర్ పద్మశాలికాలనీ తదితర ప్రాంతాల్లో సైతం పెద్దఎత్తున వర్షపు నీరు వచ్చిచేరింది. దాంతో జీహెచ్‌ఎంసీ రెస్పాన్స్ టీమ్స్‌ రంగంలోకి దిగి నీటిని తొలగించాయి. పలుచోట్ల నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో మోటార్ల ద్వారా ఎత్తిపోశారు. అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో వరద ప్రవాహానికి పార్కింగ్ చేసిన బైక్స్ కొట్టుకుపోయాయి.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.